వారు భావిస్తే.. ధోనీ తప్పక ఉంటాడు: కుంబ్లే


వారు భావిస్తే.. ధోనీ తప్పక ఉంటాడు: కుంబ్లే


ముంబయి: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ల కంటే వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్లపై టీమిండియా దృష్టి పెట్టాలని భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్‌ కుంబ్లే అన్నాడు. ''వికెట్లు తీసే సత్తా ఉన్న కుల్‌దీప్ యాదవ్‌, యుజువేంద్ర చాహల్ జట్టులో ఉండాలని అనుకుంటున్నా. ఎందుకంటే  మంచు ప్రభావిత సమయంలో ఈ మణికట్టు మాంత్రికులు అదరగొడతారు. మ్యాచ్‌లో ప్రత్యర్థుల వికెట్లపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆల్‌రౌండర్ల కంటే వికెట్లు తీసే ఫాస్ట్‌ బౌలర్లను జట్టులో తీసుకోవాలి. ఇది కీలక అంశం. ఆస్ట్రేలియా పిచ్‌ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జట్టును సిద్ధం చేసుకోవాలి. ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకువచ్చే బౌలర్లను ఎంపిక చేయాలి'' అని పేర్కొన్నాడు. 


టీమిండియా మాజీ సారథి ధోనీ పునరాగమనం గురించి కుంబ్లే మాట్లాడాడు. ''ధోనీ పునరాగమనం ఐపీఎల్‌పై ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచకప్‌కు అతడి సేవలు అవసరమని జట్టు భావిస్తే టీమిండియాలో తప్పక ఉంటాడు. దీని కోసం మనం వేచిచూడాలి. కేఎల్‌ రాహుల్‌ను బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా భావిస్తే ప్రపంచకప్‌కు ముందు అతడిని 10-12 మ్యాచుల్లో ఆడించాలి. అతడు పొట్టి ఫార్మాట్‌లో అద్భుతమైన ఆటగాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడని అనుకుంటున్నాను. నా దృష్టిలో ఈ ఏడాది భారత క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడు రోహిత్‌శర్మ. 2019లో అన్ని ఫార్మాట్లలో హిట్‌మ్యాన్‌ అదరగొట్టాడు. అత్యుత్తమ యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్'' అని కుంబ్లే తెలిపాడు.